బృందావనములో ఒకనాడు యమూనాతీరమున కృష్ణుడు తోటిబాలురతో ఆవుదూడలను మేపుచుండగా ఒకరాక్షసుడు గోవత్సరూపమునవచ్చి ఆవుదూడలతో కలిసి యుండగా, కృష్ణుడు తనను చంపుటకు వచ్చిన రాక్షసుడని గ్రహించి బలరామునికి సంజ్ఞచేయగా. బలరాముడు ఆ వత్సాసురుని వెనకకాళ్ళను తోకను పుచ్చుకొని గిరగిరా త్రిప్పి ప్రక్కనున్న వెలగచెట్టుకు వేసికొట్టగా ఆ రాక్షాసుడు చనిపోయెను. తరువాత ఇంకొకనాడు కృష్ణుడు తన స్నేహితులతో గోవులకు నీళ్ళు పెట్టుటకు కాళిందీ నదికి వెళ్లగా అచ్చట పెద్దకొండవలె బకాసురుడు కనపడెను. ఆ బకాసురుడు కృష్ణుడు సమీపించగానే తటాలునా మ్రింగివేసేను. లోనికిపోయిన కృష్ణుడు దానిగొంతులో నిలచి మండుచున్న నిప్పు వలె కాల్చగా, భరించలేక ఆ బకాసురుని కృష్ణుని బయటకు క్రక్కెను. అంత కృష్ణుడు బకాసురుని ముక్కును పూచిక పుల్లలను చీల్చినట్లు రెండుగా చీల్చి చంపివేసెను. అప్పుడు పుష్పవర్షము కురిసెను.